భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. మొదటి భాగం ఘన విజయం సాధిస్తే.. రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. పార్ట్-1 హిట్ అవుతున్నా.. పార్ట్-2 మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదు.
ఇప్పటికే బిల్లా-2 నుంచి తాజాగా వచ్చిన సర్దార్-2 వరకు పలు సీక్వెల్స్ ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇండియన్-2, చంద్రముఖి-2, సామీ-2, పందెంకోడి-2, విశ్వరూపం-2, రఘువరన్ బీటెక్-2 వంటి సినిమాలు మొదటి భాగం స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. భారీ అంచనాలతో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి.
ఈ సినిమాలను పరిశీలిస్తే.. మొదటి భాగం సృష్టించిన ఆసక్తి, కథనం, పాత్రల ప్రభావాన్ని రెండో భాగంలో కొనసాగించడంలో మేకర్స్ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో హిట్ సినిమాలకు సీక్వెల్ తీస్తే విజయం ఖాయమనే లెక్కలు తమిళ ఇండస్ట్రీలో పలుమార్లు తారుమారయ్యాయి. ఇప్పుడు రాబోయే సీక్వెల్స్ అయినా ఈ ట్రెండ్ను మార్చుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.








