“లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు.. పాజిటివ్గా ఉండు.. అందరికీ సమస్యలుంటాయి.. మర్చిపో”.. ఎవరైనా తమ బాధను చెప్పినప్పుడు చాలామంది సహజంగానే ఇలాంటి మాటలు చెబుతుంటారు. ఎదుటివారికి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు అన్నప్పటికీ.. ఆ సమయంలో వారి మనసులో ఏం జరుగుతుందో మాత్రం మనం ఆలోచించం. కొన్ని సందర్భాల్లో ఓ చిన్న సమస్యలా కనిపించేది.. బాధపడుతున్న వ్యక్తికి మాత్రం చాలా పెద్ద విషయంగా అనిపించవచ్చు.
ఒక వ్యక్తి రాత్రంతా నిద్రపోకుండా.. ఉదయం జరిగిన ఓ ఘటన గురించి పదేపదే ఆలోచిస్తున్నారని అనుకుందాం. ఆ విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే కాస్త మనసు తేలికవుతుందని భావించి ఫోన్ చేస్తారు. కానీ అవతలి వ్యక్తి “లైట్ తీసుకో.. దాని గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తావు?” అని సింపుల్గా చెప్పి ఫోన్ పెట్టేస్తే.. బాధపడుతున్న వ్యక్తి పరిస్థితి మరింత ఒంటరితనంగా మారొచ్చు. అదే విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ తనలో తానే బాధపడే అవకాశం ఉంటుంది.
అందుకే ఎవరైనా తమ బాధను మనతో పంచుకున్నప్పుడు వెంటనే సలహాలు ఇవ్వడం కంటే.. ముందుగా వారి మాటలను శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. “నీకు ఇలా అనిపించడం సహజమే.. నేను నీ మాట వింటున్నాను” అనే ఒక్క మాట కూడా వారికి ఎంతో ధైర్యాన్ని ఇవ్వొచ్చు. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పాల్సిన అవసరం లేదు.. కొన్నిసార్లు మనం చేయాల్సిందల్లా ఎదుటివారి బాధను అర్థం చేసుకుని, వారు ఒంటరిగా లేరనే భావన కలిగించడమే.








