గుజరాత్లోని మోర్బీ తాలూకా విర్పర్దా గ్రామంలో ఉన్న ఓ వ్యవసాయ బావి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే బావి నీరు అలల మాదిరిగా నిరంతరం కదులుతున్నట్లు కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి ఘటనపై విచారణ ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే ఆదేశాల మేరకు జిల్లా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు బావిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాథమిక పరిశీలనలో బావి అడుగుభాగంలో చిక్కుకున్న గాలి లేదా భూగర్భ పీడన మార్పుల కారణంగా నీటిలో ఈ తరహా కదలికలు ఏర్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు మరింత సాంకేతిక పరిశీలన అవసరమని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను ఆదేశించింది. నివేదిక అనంతరం బావి నీటి కదలికలకు గల అసలు కారణాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఈ విచిత్ర ఘటన స్థానికులతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.








