దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విద్యార్థుల ఉద్యమంలో నిరసనకారులు ఉపయోగించిన భాషపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వాన్ని, దేశ ప్రధానిని ఉద్దేశించి కొందరు విద్యార్థులు దూషణలకు దిగడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇప్పటికే విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా పలువురు ప్రముఖులు కూడా విద్యార్థుల భాషను తప్పుపడుతున్నారు.
ఈ క్రమంలో ఒలింపిక్ విజేత, స్టార్ షూటర్ మను భాకర్ కూడా విద్యార్థుల తీరుపై స్పందించారు. ప్రభుత్వాన్ని లేదా ఇతరులను దూషించడం సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న దుర్భాషల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసిన మను భాకర్.. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం ఎప్పటికీ ‘కూల్’ కాదని స్పష్టం చేశారు.
ఒక వ్యక్తికి అతని మాటలు, ప్రవర్తనే గుర్తింపును తీసుకొస్తాయని మను భాకర్ పేర్కొన్నారు. జెన్-జీ తరంలో పెరుగుతున్న అసభ్య పదజాలంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ భాషను, ఉపయోగించే పదాలను వివేకంతో ఎంచుకోవాలని సూచించారు. భావాలను వ్యక్తం చేయడంలో హద్దులు పాటించడం, గౌరవప్రదమైన భాషను ఉపయోగించడం ఎంతో ముఖ్యమని ఆమె సందేశం ఇచ్చారు.









