దుమ్ముగూడెం, జూలై 30 (వై7 న్యూస్ తెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం గ్రామపంచాయతీలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం మరియు సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ పెద్దీం చిన్నక్క అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొని ఎస్సీ, ఎస్టీ చట్టాల ప్రధాన నిబంధనలు, బాధితులకు కల్పించే రక్షణ, చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. అలాగే కుల వివక్ష, వేధింపులు, దాడుల వంటి ఘటనలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు.
అదేవిధంగా ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








