పలాస, జూలై 30 (వై7 న్యూస్): భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 18వ వార్డు రోటరీ నగర్లో స్థానిక మహిళలు వినూత్నంగా స్వాగతం పలికారు. విమానం నమూనాతో రంగురంగుల ముగ్గును వేయడంతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరై మాట్లాడారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. “వలసలు వద్దు.. ఉత్తరాంధ్ర ముద్దు” అనే నినాదంతో యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి చక్రధర్, చిన్న తదితర స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.








