పిల్లల ఆరోగ్యానికి పండ్ల రసాలు మంచివేనని భావించి చాలామంది తల్లిదండ్రులు వాటిని ప్రతిరోజూ ఇస్తుంటారు. అయితే చిన్న వయసు నుంచే పండ్ల రసాలు, చక్కెర కలిపిన పానీయాలను అధికంగా తాగించడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ లైఫ్ సైన్సెస్ జర్నల్ **‘సర్క్యులేషన్’**లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలో 25,000 మందికిపైగా వ్యక్తులపై 25 సంవత్సరాల పాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
‘న్యూస్ మెడికల్ నెట్’ కథనం ప్రకారం, వారానికి మూడు సార్ల కంటే తక్కువగా తీపి పానీయాలు తాగే పిల్లలతో పోలిస్తే రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు తాగే పిల్లలు, కౌమారదశలో ఉన్నవారికి పెద్దయ్యాక అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 52 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే అరుదుగా పండ్ల రసాలు తాగే చిన్నారులతో పోలిస్తే, రోజుకు 1.5 సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు తాగే వారికి భవిష్యత్తులో హైబీపీ వచ్చే ప్రమాదం 35 శాతం పెరుగుతుందని వెల్లడించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలకు పండ్ల రసాల కంటే నేరుగా తాజా పండ్లు ఇవ్వడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. ప్యాక్ చేసిన జ్యూస్లు, చక్కెర కలిపిన పానీయాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని వారు సూచిస్తున్నారు.








