E-PAPER

సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆదివాసీ సమస్యలపై వినతిపత్రం అందజేసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన ASP

రంపచోడవరం, జూలై 23 (Y7 న్యూస్):

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24న రంపచోడవరం పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల దీర్ఘకాలిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ శ్రీమతి మిరియాల శిరీష దేవి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలకు ASP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రాలు సమర్పించింది.

ఈ సందర్భంగా కుంజా శ్రీను మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని భద్రతా నిబంధనలు, ప్రోటోకాల్‌ను పూర్తిగా గౌరవిస్తూ శాంతియుతంగా వినతిపత్రం అందజేయాలనుకుంటున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రధానంగా స్థానిక ఆదివాసీ యువత ఉపాధి హక్కుల రక్షణ కోసం జి.ఓ. నెం.3 స్థానంలో చట్టబద్ధమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం, గిరిజన భూముల పరిరక్షణకు ఎల్‌టీఆర్ (1/70) చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడం, మారుమూల గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారి సదుపాయాలను మెరుగుపరచడం, అటవీ హక్కుల చట్టం (FRA) కింద పట్టాల మంజూరు మరియు మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను ముఖ్యమంత్రికి వివరించనున్నట్లు తెలిపారు.

శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా, అధికారులకు అసౌకర్యం కలిగించకుండా తమ ప్రతినిధి బృందానికి సీఎం అపాయింట్‌మెంట్ కేటాయించాలని ఎమ్మెల్యే శిరీష దేవి, జిల్లా అధికారులను ASP నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News