మణుగూరు, అక్టోబర్ 30:
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఆదివాసి ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 3న జరగబోయే ఐటీడీఏ ఏటూరు నగారం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మణుగూరు డివిజన్ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సోలం హరి శంకర్ పిలుపునిచ్చారు.
కరకగూడెం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చందా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సోలం హరి శంకర్ అన్నారు.
1977లో ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్ స్థానాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 149వ జీవో ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం చట్టవిరుద్ధం, ఎందుకంటే ఈ నిర్ణయానికి భారత పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లేదా రాష్ట్రపతి ఆమోదం లేవు.
దీని ఫలితంగా నిజమైన ఆదివాసీలకు చెందవలసిన విద్యా, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రిజర్వేషన్లను లంబాడీలు అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల అసలైన ఆదివాసీ సమాజం తీవ్రంగా నష్టపోతోంది,” అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ఆదివాసి ప్రజాప్రతినిధులు ఈ అంశంపై న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం కూడా ఆయన గుర్తుచేశారు. “న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీలపై లంబాడి సామాజిక వర్గం అవమానకర వ్యాఖ్యలు చేయడం ఖండనీయం. ఒకవైపు న్యాయపోరాటం కొనసాగిస్తూ, మరోవైపు ప్రజాపోరాటాన్ని కూడా బలపరచాలని నిర్ణయించుకున్నాం,” అని ఆయన తెలిపారు.
నవంబర్ 3న జరిగే ఐటీడీఏ ఏటూరునాగారం ముట్టడి కార్యక్రమంలో మణుగూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల నుంచి ఆదివాసి ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి తుర్రం రవికుమార్, పినపాక మండల అధ్యక్షులు పడిగ అశోక్, ప్రధాన కార్యదర్శి పడిగ వీరభద్రం, మణుగూరు మండల ప్రధాన కార్యదర్శి మడకం ప్రసాద్, ఉపాధ్యక్షులు కొండ్రు నాగేందర్, మండల కార్యదర్శి వాడ రాంబాబు, గొగ్గల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.









