ప్రజల మనిషి పాయంను విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు .
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్
మణుగూరు, అక్టోబర్ 30 :
పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పీరినాకి నవీన్ మండిపడ్డారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు.
“ప్రజలతో మమేకమై పని చేసే పాయం వెంకటేశ్వర్లాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలకు విమర్శ చేసే నైతిక అర్హత లేదు” అని నవీన్ హెచ్చరించారు.
“గత పది సంవత్సరాల మీ అవినీతి, అరాచక పాలన చూసి ప్రజలే బీఆర్ఎస్ను తుడిచిపెట్టేశారు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంటతో అబద్ధాలు చెబుతున్నారు” అని మండిపడ్డారు.
రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకలలో ప్రజల ఉత్సాహం చూసి బీఆర్ఎస్ నాయకులు “మతిభ్రమించి ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని” ఆయన వ్యాఖ్యానించారు.
“కుర్రి నాగేశ్వరరావు పొంగులేటి లేదా పాయం లాంటి ప్రజానాయకులపై మాట్లాడే స్థాయిలో లేరు” అని ఆయన వ్యాఖ్యానించారు.
“ప్రజల మద్దతుతో పాయం 20 నెలల్లో చేసిన పనులు, మీరు పది సంవత్సరాల్లో చేయలేకపోయారు” అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అవినీతి, భూకబ్జాలు, నిర్లక్ష్యానికి ముగింపు పలికిందని గుర్తు చేశారు.
సమావేశంలో టౌన్ అధ్యక్షుడు బోనగిరి శివసైదులు, ఆలయ చైర్మన్ కూచిపూడి బాబు, టీవీ సుబ్బారెడ్డి, ఎనిక దినేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.









