భారత్ కు పొరుగు దేశమైన నేపాల్ ఇంకా వరద విలయంలోనే చిక్కుకుంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తవ్వేకొద్దీ మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 1,282 కు చేరుకుందని సమాచారం. ఇంకా 5 వేల మందికి పైగా ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. నేపాల్ పోలీసులు, రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక ఆగస్టు 26 న నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపు 2.56 బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేపాల్ లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 275 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.
ఇప్పటి వరకూ నేపాల్ లో వరదల ధాటి నుంచి 166 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు భారత్ లోని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వరదల నుంచి రక్షించిన వారి పేర్లను విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ప్రకటిస్తోందని వివరించారు. ఈ మేరకు సహాయక చర్యల్లో నేపాల్ ప్రభుత్వం చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం అభినందిస్తోందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.








