E-PAPER

ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో ఎయిర్‌పోర్ట్‌..!

దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం భారీ వర్షం ముంచెత్తింది. ఈ కుండపోత వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, పలు విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లించారు.

వివరాల్లోకి వెళితే, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ ప్రభావంతో మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్యలో దాదాపు తొమ్మిది విమానాలను దారి మళ్లించారు. వీటిలో నాలుగు విమానాలను జైపూర్‌కు, మరో నాలుగు లక్నోకు, ఒకటి అహ్మదాబాద్‌కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం, 400కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో రోజుకు 1,300కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమాన సర్వీసులపై ప్రభావం పడిందని ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు వేర్వేరుగా ప్రకటించాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు తమ ఫ్లైట్ స్టేటస్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించాయి. రోడ్లపై నెమ్మదిగా ప్రయాణం సాగుతున్నందున, ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని ఇండిగో కోరింది.

ఎయిర్‌పోర్ట్‌లో కార్యకలాపాలపై ప్రభావం పడిందని, తాజా సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం విజ్ఞప్తి (జీఎంఆర్) చేసింది. నీటిని తొలగించడానికి తమ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపింది. మరోవైపు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్ర వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!