
ఏటూరునాగారం: నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నాయకులు దడిగల సమ్మయ్య పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 15న ములుగులో నిర్వహించనున్న నాయి బ్రాహ్మణ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
ఏటూరునాగారం మండల కేంద్రంలో మంగళవారం నాయి బ్రాహ్మణుల సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకులు దడిగల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఆహ్వాన కమిటీ అధ్యక్షులు జంపాల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నకుమార్తో పాటు మద్దూరి రాజు, ముత్యాల రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జంపాల సత్యనారాయణ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15న ములుగులో జరిగే నాయి బ్రాహ్మణ జిల్లా మహాసభకు జిల్లాలోని నాయి బ్రాహ్మణ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
నాయి బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని, నిరంతరం ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా మహాసభ అనంతరం జిల్లా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం ఏటూరునాగారం కేంద్రంలో కాలు ప్యాచర్తో బాధపడుతున్న దడిగల రామును నాయకులు పరామర్శించారు. అనంతరం జిల్లా మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కొత్తపల్లి వెంకన్న, దడిగల సత్యం, దడిగల రాము, దడిగల రాజారాం, శ్రీరాముల చంద్రశేఖర్, దడిగల శ్రీను తదితరులు పాల్గొన్నారు.









