చర్ల , జూలై 30 (వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది.
పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టులోని 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తగా, మిగిలిన 15 గేట్లను కూడా ఎత్తి మొత్తం 24 గేట్ల ద్వారా 92,309 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ప్రాజెక్టు పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.









