మణుగూరు, జూలై 25: ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల హక్కులను కాపాడడం ప్రతి కార్యకర్త బాధ్యత అని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న రేగా కాంతారావు, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు, లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులకు సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతోందని, ప్రజల పక్షాన నిలబడటం పార్టీ విధానమని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









