మణుగూరు,జూలై 25 (వై 7 న్యూస్ తెలుగు);
అశ్వాపురం మండలం మనబోతులగూడెం పంచాయతీ పరిధిలోని వేములూరు గ్రామంలో అటవీ సంరక్షణ పనులు నిర్వహిస్తున్న తమపై దాడులు జరుగుతున్నాయని, అయినప్పటికీ తమపైనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారని అటవీశాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
పోడియం నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని గొత్తికోయ గుంపుతో కుదిరిన ఒప్పందం మేరకు అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో కొందరు మహిళలు తమపై దాడి చేశారని వారు పేర్కొన్నారు. అడవులను రక్షించే బాధ్యత నిర్వర్తిస్తున్న తమకు రక్షణ కల్పించాల్సింది పోయి, మాపైనే చర్యలు తీసుకోవడం అన్యాయమని వాపోయారు.
ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది తమ సమస్యలను వివరిస్తూ గురువారం అశ్వాపురం పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. తమ విధులు సక్రమంగా నిర్వహించేందుకు తగిన భద్రత కల్పించాలని, లేకపోతే ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయడం కష్టమవుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
అటవీశాఖ సిబ్బంది వినతిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.









