పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు
పలాస, జూలై 24 (వై7 న్యూస్): నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో పలువురు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి.
బంద్కు మద్దతుగా పలు పాఠశాలలు, కళాశాలలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు సాయికుమార్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా పలువురు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని అన్నారు. లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు కోరారు. అలాగే, ఈ అంశంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు.
ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)ను రద్దు చేసి, నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ బంద్కు సీపీఐ నాయకులు లండా వెంకటరావు, వంకల ముకుందరావు మద్దతు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.








