దుమ్ముగూడెం ,జూలై 22 (వై7 న్యూస్ తెలుగు );
దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామంలో నడి రోడ్డుపై అనుమానాస్పదంగా ఏర్పాటు చేసిన పూజా సామగ్రి స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది. రోడ్డుపై కనిపించిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పూజా వస్తువులు చూసిన కొందరు గ్రామస్తులు వాటిని క్షుద్ర పూజలుగా భావించి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం దూసుకుపోతున్న ఈ ఆధునిక యుగంలో మూఢనమ్మకాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు కనిపించినప్పుడు భయపడకుండా, వాటి వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ, “ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు?” అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే చర్యలకు పాల్పడకుండా ఉండాలని, మూఢనమ్మకాల కంటే విజ్ఞానం, అవగాహన, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
నడి రోడ్డుపై ఇటువంటి వస్తువులను ఉంచడం వల్ల ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు భయపడే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.









