బ్యాంక్ ఖాతా సమస్యపై కలెక్టర్ వెంటనే స్పందించాలి: బీఎస్పీ నాయకుడు కొండా చరణ్
చర్ల మండలంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో బ్యాంక్ ఖాతా సంబంధించిన సమస్య తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని బీఎస్పీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండా చరణ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయంపై బీఎస్పీ పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించగా, కొండా చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
నామినేషన్ పత్రాలకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ జతపరచాలని ఎన్నికల అధికారులు చెబుతుండగా, మరోవైపు బ్యాంక్ మేనేజర్లు గతంలో అకౌంట్ ఉన్నవారికి కొత్త ఖాతా ఇవ్వలేమని సూటిగా చెబుతున్నారని తెలిపారు. దీనివల్ల పోటీదారులు కొత్త ఖాతాలు తెరవలేని పరిస్థితి ఏర్పడి, నామినేషన్ ప్రక్రియ అంతా అయోమయంగా మారిందని అన్నారు.
“ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?” అని స్థానిక ఎన్నికల అధికారులు, ఎంపీడీఓలను ప్రశ్నించగా,
“మాకు సంబంధం లేదు” అని సమాధానం ఇచ్చారని, ఇది బాధ్యతారాహిత్యపు వైఖరని చరణ్ విమర్శించారు.
తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని,
బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని,
నామినేషన్ ప్రక్రియలో పోటీదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు పడిగల వెంకట్, ఉపాధ్యక్షుడు చన్నము మోహన్, మండల కోశాధికారి ఎస్కే జహీరుుద్దీన్ భాష, ప్రధాన కార్యదర్శి సోయం శ్రీమూర్తి, సీనియర్ నాయకులు గుర్రాల దుర్గ భవాని, కొండ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.









