పర్యావరణ పరిరక్షణకు నైనిక కృషిని అభినందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కొత్తగూడెం ; పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంత ఉందనే విషయాన్ని తెలియజేస్తూ జిల్లాస్థాయి సైన్స్ఫేర్లో ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా ఇచ్చిన ప్రదర్శనకుగాను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సైన్స్ ఫేర్ ముగింపు సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ తన ప్రసంగంలో నైనిక రజువా గురించి ప్రస్తావించారు. పర్యావరణంపై గొప్పగా మాట్లాడుతారు కాని మన జిల్లాలో ఎంతో అటవీ సంపద ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా అటవీ ప్రాంతంలో పెరిగే పది ఔషద మొక్కల పేర్లు కూడా తెలియవని అన్నారు. మనకు ఏదైనా అనారోగ్యం చేస్తే మందులు తెచ్చి వేసుకుంటామని, దానికి సైడ్ ఎఫెక్ట్స్కి మరో మెడిసిన్ వేసుకుని మొబైల్ చూస్తూ పర్యావరణం బాగోలేదని అనుకుంటాం తప్ప ఆయా చెట్ల గింజలను ఎలా సేకరించాలి, వాటిని మొక్కలుగా ఎలా తయారు చేయాలి, మొక్కలను నాటి పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనే అంశాలను ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. మనకు సాధ్యమైనంత వరకు ఔషద మొక్కలతోపాటు అన్ని రకాల మొక్కల గింజలను సేకరించి, మొక్కలను నాటి పెంచడం ద్వారా ఇలాంటి బాధలు పడాల్సిన అవసరం ఉండదని అన్నారు. మొక్కల పెంపకం వల్ల మనలో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుందని, ఆరోపణలు, ఆవేశాలు అన్నీ తగ్గుతాయన్నారు. ఇతర దేశాల్లో ఔషద మొక్కల పెంపకం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని, మనకు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నందున ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని సూచించారు.









