పందింటి నవీన్ కుమార్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్
నడిగూడెం జూన్ 27 వై 7 న్యూస్: గ్రామపంచాయతీ కార్మికుల న్యాయహక్కులకు మద్దతుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నడిగూడెం మండలంలో ఉమ్మడిగా నినాదాలు చేశారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల పట్ల చూపిన నిర్లక్ష్య ధోరణిని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తూటాగా అనుసరిస్తోంది” అని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పందిటి నవీన్ కుమార్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో హామీగా చెప్పిన గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను ఇప్పటికీ అమలు చేయకపోవడం ప్రభుత్వ అనాలోచిత, మొండి వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. రాజ్యాంగంలో కార్మికులకు కల్పించిన హక్కులను కాలరాస్తూ, ముందస్తు అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలన్న ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రంగా ఖండించదగినవని పేర్కొన్నారు.
“అక్రమ అరెస్టులు కాదు… చేతనైతే సిబ్బంది సమస్యలు పరిష్కరించండి” అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జిపి కార్మికులకు పిలుపునిస్తూ — “వీలైనంతగా ముందస్తు అరెస్టులకు గురికాకుండా హైదరాబాద్కి చేరి, మన న్యాయమైన హక్కుల కోసం గళమెత్తాలి” అని పిలుపునిచ్చారు.
రేపు (జూన్ 28) పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా విజయవంతం చేస్తామని, ప్రభుత్వ మొండితనానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.
“తక్షణమే డిమాండ్లు అమలు చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతాం” అని నినాదాలు చేశారు.









