E-PAPER

కృత్రిమ సూర్యుడి దిశగా భారత్ కీలక ముందడుగు..!

అపరిమితమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని సృష్టించే లక్ష్యంతో భారత్ చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ పరిశోధనల్లో మరో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్’ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టోకామాక్-1 రియాక్టర్‌లో అత్యంత శక్తివంతమైన కొత్త గైరోట్రాన్ వ్యవస్థను విజయవంతంగా అనుసంధానించారు. ఈ పరిణామంతో ఫ్యూజన్ టెక్నాలజీపై జరుగుతున్న పరిశోధనలు మరింత వేగవంతం కానున్నాయి. సూర్యుడిలో శక్తి పుట్టే అణు సంలీన ప్రక్రియను భూమిపైనే సృష్టించి అపారమైన శక్తిని ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. డోనట్ ఆకారంలో ఉండే ఈ ప్రయోగాత్మక రియాక్టర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ఉండే ప్లాస్మాను నియంత్రించడం అత్యంత కీలకం. తాజాగా ఏర్పాటు చేసిన 82.6 గిగాహెర్ట్జ్, 400 కిలోవాట్ల సామర్థ్యం గల గైరోట్రాన్.. ప్లాస్మాను వేడిచేయడానికి, కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉన్న 42 గిగాహెర్ట్జ్, 500 కిలోవాట్ల వ్యవస్థతో కలిసి ఇది పనిచేయనుండటంతో శాస్త్రవేత్తలకు ప్రయోగాల్లో మరింత సౌలభ్యం లభించనుంది. సూర్యుడు తన గురుత్వాకర్షణతో ప్లాస్మాను నియంత్రిస్తే, భూమిపై ఆ ప్రక్రియ కోసం శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలను వాడాల్సి ఉంటుంది. ప్లాస్మాను స్థిరంగా, ఎక్కువసేపు నిలపడమే శాస్త్రవేత్తల ముందున్న అసలు సవాలు. ఈ క్రమంలో భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే సూర్యుడి కేంద్రకం కన్నా కొన్ని రెట్లు అధికంగా ఉష్ణోగ్రతను సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతానికి ఎస్ఎస్‌టీ-1 వాణిజ్యపరంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయదు. ఇది కేవలం భవిష్యత్ పరిశోధనల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఈ కొత్త గైరోట్రాన్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్మాను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుంది. రాబోయే కాలంలో అత్యాధునిక ఫ్యూజన్ రియాక్టర్ల నిర్మాణానికి ఈ పరిశోధనలు బలమైన బాటలు వేయనున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!