కొలంబియాలో సోమవారం సంభవించిన 7.4 తీవ్రత గల శక్తివంతమైన భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో కనీసం 111 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పలుచోట్ల భవనాలు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. USGS ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:34 గంటలకు భూకంపం సంభవించింది.
భూకంప కేంద్రం కొలంబియాలోని చోకో డిపార్ట్మెంట్లోని శాన్ జోస్ డెల్ పాల్మార్కు తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సుమారు 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు. పెరీరాలో 18 మంది, మనిజాలెస్లో ఇద్దరు మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాలి నగరంలో కనీసం 20 భవనాలు కూలిపోయినట్లు మేయర్ అలెజాండ్రో ఎడర్ తెలిపారు.
భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. భవనాలకు నష్టం జరిగిందా, పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయా అనే విషయాన్ని పరిశీలించాలని అధికారులు ప్రజలకు సూచించారు. భవనం సురక్షితంగా లేదని అనిపిస్తే వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. భూకంపం తర్వాత సంభవించే ప్రకంపనలపై కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.








