ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇరాన్ సరిహద్దుల వెంట భూసేనలు పూర్తి యుద్ధ సన్నద్ధతలో ఉన్నాయని ఆ దేశ సైనిక అధికారులు వెల్లడించారు. అమెరికా సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
ఇరాన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ మాట్లాడుతూ.. ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైనికులు ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సరిహద్దుల వెంబడి సైనిక బలగాలను అప్రమత్తంగా ఉంచామని, శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. ఇరాన్ భద్రతకు ముప్పు ఏర్పడితే తగిన రీతిలో స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్ సైనిక బలగాలు క్షిపణులు, డ్రోన్లు, ట్యాంకులు, రాకెట్లు సహా వివిధ రకాల ఆయుధాలతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అమెరికా నుంచి ఎలాంటి సైనిక చర్య జరిగినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.








