మణుగూరు జూన్ : 26
మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మొహర్రం ఇస్లామీయ హిజ్రీ సంవత్సరంలోని మొదటి నెలగా, ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటని పేర్కొన్నారు. ముఖ్యంగా 10వ రోజు అయిన ఆషూరాకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు.
షియా ముస్లింలు ఈ రోజున ఇమామ్ హుసైన్ ఇబ్న్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు కర్బలా యుద్ధంలో ధర్మం కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటారని తెలిపారు. అన్యాయానికి ఎదురు నిలిచి సత్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ఆదర్శం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా మజ్లిస్లు, ప్రార్థనలు, ఊరేగింపులు నిర్వహిస్తూ వారి త్యాగాన్ని స్మరించుకుంటారని వివరించారు.
అలాగే సున్నీ ముస్లింలు కూడా ఆషూరా రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారని పేర్కొన్నారు.
మొహర్రం పర్వదినం త్యాగం, ధర్మం, న్యాయం, సహనం, ఐక్యత, మానవత్వం వంటి గొప్ప విలువలను చాటిచెబుతుందని, కులమతాలకు అతీతంగా శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించుకోవాలని ఈ పర్వదినం సందేశమిస్తుందని కర్నే రవి అన్నారు.
చివరగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.








