భద్రాచలం, జూన్ 25 (Y7 న్యూస్): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సమీపంలోని అహోబిలం నరసింహస్వామి ఆలయంలో ప్రముఖ జ్యోతిష్యులు, నృసింహ ఉపాసకులు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల ప్రత్యేక యోగ శిబిరం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల సంక్షేమంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ఈ యోగ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చైతన్య స్వామి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ హాజరై యోగ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల శ్రేయస్సు, ప్రకృతి అనుగ్రహం, రాష్ట్ర ప్రజల సుభిక్షత కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యుడు సుబ్బారావు, మండల నాయకులు, భక్తులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ యోగ శిబిరంలో ఆధ్యాత్మిక, యోగ సాధనలతో పాటు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.









