శ్రీకాకుళం జిల్లా, పలాస, ఆగస్టు 7 (వై7 న్యూస్):
మందస మండలంలోని సవర రాజపురం, దాలసరి గ్రామాల్లో సుమారు రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాలను పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా కార్యక్రమాలు, అంగన్వాడీ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని ప్రతి చిన్నారికి మెరుగైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం ఆహారం పంపిణీ చేసే కేంద్రాలుగానే కాకుండా, చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులుగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
గిరిజన బిడ్డల విద్య, ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, అంగన్వాడీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం, మహిళా-శిశు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా మరింత బాధ్యతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సవర రాజపురం, దాలసరి గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. తమపై చూపుతున్న ఆదరణకు గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.








