మణుగూరు, ఆగస్టు 3: మణుగూరు సింగరేణి కార్మికుల చిరకాల ఆకాంక్ష అయిన బహిరంగ గని రెండో దశ లోతట్టు విస్తరణను సింగరేణి సంస్థకే కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మణుగూరు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పట్టా బిక్షపతి మాట్లాడుతూ, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు.
మాట్లాడిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని, ఇది కేవలం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని మరోసారి నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సింగరేణి కార్మికులు, మణుగూరు ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
బహిరంగ గని రెండో దశ లోతట్టు విస్తరణను సింగరేణికే కేటాయించడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని బిక్షపతి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.









