బూర్గంపాడు;
బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో బస్టాండ్ లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి బస్టాండ్ నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరావు గారిని కోరింది.
లక్ష్మీపురం గ్రామం కీలక రహదారి జంక్షన్గా ఉండి, మణుగూరు–భద్రాచలం మార్గంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా లక్ష్మీపురం నుండి బూర్గంపాడు, టేకులచెరువు, బంజారా ప్రాంతాలు, అలాగే మణుగూరు వైపు వెళ్లే రహదారులు ఇక్కడ కలుస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో బస్టాండ్ అవసరం అత్యంత అత్యవసరమైందని వెల్లడించారు.
గ్రామ ప్రజలు చాలా కాలంగా బస్టాండ్ నిర్మాణం కోసం కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని సిపిఎం నాయకులు అన్నారు. జింకలగూడెంలో నిర్మించిన విధంగానే లక్ష్మీపురంలో కూడా బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.








