అశ్వాపురం;
అశ్వాపురం మండల పరిధిలోని అమ్మవారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి రూత్విక్ ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులకు ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ దాతల సహాయం కోరారు.
ఈ విషయం తెలుసుకున్న అమ్మవారిపల్లి గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి, “జనం కోసం మనం” స్వచ్ఛంద సంస్థ సభ్యుడు ఎస్కే అజార్ ప్రత్యేక చొరవ తీసుకుని చిన్నారి పరిస్థితిని దాతలకు తెలియజేసి విరాళాలు సేకరించారు.
దీంతో “జనం కోసం మనం” స్వచ్ఛంద సంస్థ తరఫున రూ.20,000, అశ్వాపురం మండల అధికారులు మరియు సిబ్బంది సహకారంతో రూ.22,000 సేకరించి మొత్తం రూ.42,000లను ఖమ్మంలోని అంకుర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ యూడీసీ పద్మావతి, అమ్మవారిపల్లి సర్పంచ్ ఇర్ఫా కవిత, పంచాయతీ కార్యదర్శులు వేణుప్రియ, ఎస్కే అజార్, దొడ్డ శరత్, అలాగే “జనం కోసం మనం” స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రోహిత్, ఎస్కే అంకుష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షించారు.








