మణుగూరు, జూన్ 26 (పులిపాటి పాపారావు | జర్నలిస్ట్)
మనుగూరు ఓసీ విస్తరణలో భాగంగా గురువారం మణుగూరు రెవెన్యూ గ్రామ భూసేకరణ అంశంపై ఓ గ్రామసభ నిర్వహించబడింది. కొమ్ముగూడెం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ సభకు గ్రామ పెద్ద కంగాల భిక్షం అధ్యక్షత వహించగా, గ్రామ సభ్యులు సున్నం మంగయ్య, చందా నాగేష్ పాల్గొన్నారు. భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీ.సుమ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా టీ.సుమ మాట్లాడుతూ మనుగూరు ఓసీ విస్తరణలో ప్రజాపయోగం కోసం భూసేకరణ ఎంత అవసరమో గ్రామస్థులకు సమగ్రంగా వివరించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరాకు రూ.22,50,000 నష్టపరిహారం, అదనంగా పునరావాస ప్యాకేజీగా రూ.5.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న గిరిజనులకు పూర్తి ప్యాకేజీతో పాటు, గిరిజనేతలకు రూ.11,25,000 మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అర్హులైన నిరుద్యోగ భూసేకరణ బాధితులకు కనీస వేతనం కోల్పోకుండా, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసే శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భూములపై చెట్లు, బోర్లు, బావులు, కట్టదాల్లాంటి ఆస్తులున్నచో సంబంధిత శాఖల ద్వారా వాటికి వేర్వేరుగా అంచనాలు వేసి, అదనపు పరిహారం అందించనున్నారు.
చేరువులపై ఆధారపడే అర్హులైన మత్యకార కుటుంబాలకు కూడా రూ.5.5 లక్షల పునరావాస ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపారు. ఈ సమాచారం అనంతరం గ్రామస్థులు పూర్తి స్థాయిలో ఓసీ విస్తరణకు తమ భూములు ఇవ్వడానికి అంగీకారం వ్యక్తం చేస్తూ సభాముఖంగా చేతులెత్తి మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు.
ఈ గ్రామసభలో మణుగూరు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ, సింగరేణి అధికారులు, డిప్యూటీ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.









