భేజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోద్రజ్పదర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్.. సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కీలక విజయము
సుక్మా , ఆగస్ట్ 04 (వై 7 న్యూస్)
సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లో నక్సలైట్లు దాచిపెట్టిన ఆయుధాలు లభ్యమయ్యాయి. భేజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోద్రజ్పదర్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో రెండు బోల్ట్-యాక్షన్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
సీఆర్పీఎఫ్ డీఐజీ రాజేష్ పాండే, 50వ బెటాలియన్ కమాండెంట్ ప్రేమ్జీత్ సింగ్ ఆదేశాల మేరకు భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా అడవుల్లో నక్సలైట్లు రహస్యంగా దాచిపెట్టిన ఆయుధాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఆపరేషన్లో సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్లు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నక్సలైట్ల కదలికలపై ముందస్తు సమాచారంతో నిర్వహించిన గాలింపు చర్యల్లో ఈ విజయాన్ని సాధించినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాల కూంబింగ్ చర్యలు మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.









