దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమై బలంగా పుంజుకున్నాయి. గత సెషన్లో భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు పెరగడంతో తిరిగి గ్రీన్ జోన్లోకి వచ్చాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసగా ఆరో రోజూ కొనుగోళ్లు కొనసాగించడంతో మార్కెట్ సెంటిమెంట్కు బలం చేకూరింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ప్రారంభ ట్రేడింగ్లోనే గణనీయమైన లాభాలు నమోదు చేశాయి.
ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు లాభపడి 77,052 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 172 పాయింట్లు ఎగిసి 24,054 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 540 పాయింట్లకు పైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 719 పాయింట్లు పెరిగింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹95.55 వద్ద కొనసాగుతోంది.
వ్యక్తిగత షేర్లలో కల్యాణ్ జువెల్లర్స్, స్విగ్గీ, డిక్సన్ టెక్నాలజీస్, ఎటర్నల్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాభాల్లో నిలిచాయి. మరోవైపు ఇన్ఫోసిస్, నాల్కో, పాలీక్యాబ్, సోలార్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడంతో ఇన్వెస్టర్లలో ఆశావాదం పెరిగింది.









