రాయలసీమను దేశంలోనే ప్రముఖ ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. కడప జిల్లా లింగాల మండలంలో ఉద్యానవన పంటల సాగు వల్ల ప్రజల తలసరి ఆదాయం రూ.7.30 లక్షలకు చేరుకోవడం ఆదర్శమని పేర్కొన్న ఆయన, ఇదే నమూనాను రాయలసీమ అంతటా అమలు చేయాలని సూచించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి హార్టికల్చర్ ప్రధాన గ్రోత్ ఇంజిన్గా మారాలని, 25కు పైగా ఉద్యాన పంటల ఉత్పత్తిని ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పూర్వోదయ పథకం కింద రూ.40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, మరో రూ.60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులతో ఉద్యానవన రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం తెలిపారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్దఎత్తున ఏర్పాటు చేస్తే రైతుల ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలోని విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం, ఆరు నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ను ప్రజల ముందుంచి అభిప్రాయాలు స్వీకరించాలని, అలాగే రెండు నెలల్లో ప్రతి జిల్లాకు సంబంధించిన ఎకనామిక్ ప్రొఫైల్ సిద్ధం చేసి స్థానిక అభివృద్ధి అవకాశాలపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.








