E-PAPER

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

భద్రాచలం, జూలై 7 (వై7 న్యూస్): భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మంగళవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, అత్యవసర విభాగం పనితీరు, వార్డుల నిర్వహణ, ఔషధాల లభ్యత, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు.

అత్యవసర సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిశుభ్రత, సిబ్బంది సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి పేద రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ఆసుపత్రుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, సేవల్లో నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

ఇటీవల భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న యువకుడికి విజయవంతంగా స్కిన్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్స నిర్వహించిన నేపథ్యంలో, ఆ రోగి ఆరోగ్య పరిస్థితిని కూడా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఆ శస్త్రచికిత్స రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News